
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా, రాయలసీమ ప్రాంతంలో జరిగే అత్యంత ఉత్సాహభరితమైన, సాంస్కృతికంగా ప్రాముఖ్యత కలిగిన జానపద ఉత్సవాలలో *తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర* ఒకటి. ప్రతి సంవత్సరం మే నెలలో తిరుపతిలో వెలసియున గంగమ్మ దేవతకు జరుపుకునే ఈ ఉత్సవమే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర. అంతేకాకుండా గంగమ్మ దేవత తిరుపతి *గ్రామ దేవత* (ఆ గ్రామ ప్రజలను రక్షించే దేవత) హోదాలో కూడా పూజలు అందుకుంటుంది. స్థానిక ప్రజలు అమ్మవారిని సాంప్రదాయకంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చెల్లెలిగా కూడా పూజిస్తారు.
*చరిత్ర:*
వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన గంగమ్మ దేవాలయం అప్పటి చంద్రగిరి యాదవ రాజు ఘట్టిదేవ యాదవరాయ చేత తిరుపతి నిర్మాణం తో పాటు, తిరుపతిలోని గంగమ్మ దేవాలయం నిర్మించబడింది.
*గంగమ్మ జానపద గాథ:*
జానపద కథనం ప్రకారం, ఆ ప్రాంతంలోని స్త్రీలను చరపట్టే ఒక స్థానిక నాయకుడు ఉండేవాడు. అతని క్రూరత్వాన్ని అంతం చేయడానికి గంగమ్మ తల్లి అవిలాల గ్రామంలో జన్మించింది. ఆ నాయకుడు ఆమెకు హాని తలపెట్టినప్పుడు, ఆమె ఒక భయంకరమైన రూపం ధరించడంతో అతను భయంతో దాక్కున్నాడు. అతన్ని బయటకు రప్పించడానికి, అమ్మవారు మరియు అమ్మవారికి తోడుగా తిరుపతి ప్రజలు రకరకాల వేషాలు ధరించి, అతన్ని రెచ్చగొట్టడానికి కఠినమైన మాటలు మాట్లాడతారు. చివరి రోజున, అతను దాక్కున్న చోటు నుండి బయటకు రాగా అమ్మవారి చేతిలో సంహరించబడ్డాడు.
*ముఖ్యమైన ఆచారాలు:*
*గంగ పెట్టె:* ప్రతి గంగమ్మ గుడిలో యాదవ యోధులకు సంబంధించిన గంగపెట్టే ఒకటి ఉంటుంది. ఇందులో వీరతాళ్ళు ఉంటాయి. యాదవ వీరులలో బావలు – బావమరుదులు అను రెండు వర్గాలుగా విడిపోయి, ఆ వీరతాళ్ళను అందుకొని దాడులు, ప్రతి దాడులు చేసుకుంటారు. బావ (ఒక వర్గం) – బావమరుదులు (మరో వర్గం) ఆ వీరతాళ్లు అందుకొని ఒక క్రమ పద్ధతిలో ఒక వర్గం పై మరో వర్గం ఆ వీరతాలతో దాడి చేస్తారు. దానిని కాచుకొని తర్వాత వంతులో దాడిని కాచుకున్నవారు తిరిగి దాడి చేస్తారు. ఇలా దాడులు, ప్రతి దాడులు జరిగిన తర్వాత గెలిచిన వర్గానికి పట్టం కడతారు. దీనికి తిరుపతిలోని యాదవ వీధి వారు నాయకత్వం వహిస్తారు.
*సప్పరాలు:* భక్తులు తమ మొక్కులలో భాగంగా, ఎత్తైన, రంగురంగుల అలంకరణలతో ఉన్న పగోడా లాంటి నిర్మాణాలను తమ భుజాలపై మోసుకుని ఆలయానికి తీసుకువెళతారు.
*మట్టి విగ్రహం:* ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అమ్మవారి భారీ మట్టి విగ్రహాన్ని తయారు చేస్తారు. చివరి రోజున, దానిని ముక్కలుగా పగలగొడతారు. ఈ మట్టి పెంకులకు పవిత్రమైన స్వస్థత చేకూర్చే మరియు రక్షించే శక్తులు ఉన్నాయని నమ్మి, భక్తులు వాటిని సేకరిస్తారు.
*రాగి అంబలి:* రాగి పిండి, పెరుగుతో తయారుచేసే ఈ సాంప్రదాయ చల్లని పానీయాన్ని పెద్ద పరిమాణంలో తయారు చేసి *ప్రసాదంగా* అమ్మవారికి సమర్పించి, భక్తులకు వితరణ చేస్తారు.
*పట్టు వస్త్రం:* తోబుట్టువుల బంధానికి ఒక అందమైన ప్రదర్శనగా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారు వేంకటేశ్వర స్వామి తరపున ఆయన సోదరి గంగమ్మకు “పరిసు” (చీరలు, పసుపు, కుంకుమ వంటి శుభప్రదమైన కానుకలు) పంపుతారు.
