
-ప్రజల విశ్వాసంతోనే అధికారులకు గుర్తింపు-ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు హైడ్రా కమిషనర్ దిశానిర్దేశం
❇️ప్రజాసేవలో నిబద్ధత, పరిపాలనలో పారదర్శకత, ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపించినప్పుడే అధికారులకు మంచి గుర్తింపు లభిస్తుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అన్నారు.
ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే అధికారుల ప్రదాన లక్ష్యం కావాలని సూచించారు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు బుధవారం దిశానిర్దేశం చేశారు.
సమస్యను క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడంతో పాటు ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం ఉన్నప్పుడే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు.

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టడం ద్వారా ప్రజల విశ్వాసం పొందవచ్చునని చెప్పారు.
ప్రతి నిర్ణయంలో నిష్పక్షపాత ధోరణి పాటిస్తూ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.
ఉద్యోగాన్ని హోదాగా కాకుండా బాధ్యతగా భావించి సేవా దృక్పథంతో ముందుకు సాగాలని హైడ్రా కమిషనర్ సూచించారు.
“భూముల పరిరక్షణ మరియు ఆక్రమణల తొలగింపు” అంశంపై సమగ్ర అవగాహన కల్పించారు.
ప్రభుత్వ భూముల సంరక్షణలో రెవెన్యూ అధికారుల పాత్ర, భూ ఆక్రమణల నివారణకు అనుసరించాల్సిన చట్టపరమైన విధానాలు, ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను వివరించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భూ రికార్డుల నిర్వహణ..
వివరాలను పొందు పరచడంలో చొరవ చూపాలన్నారు. అధికార విధులు నిర్వహించడంలో మీ ప్రత్యేకత కనపడాలని..
మీకంటూ ఒక బ్రాండ్ సృష్టించాలన్నారు. నిజాయతీ.. నిబద్ధత, పారదర్శకతతో వ్యవహరించి..
విధులకు న్యాయం చేస్తున్నామనే భావన ఒత్తిడిని దూరం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు ఆసక్తిగా పాల్గొని వివిధ అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
హైడ్రా కార్యకలాపాలపై ఆరాతీశారు. ఆక్రమణలు తొలగించినప్పుడు ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పరిపాలనాపరమైన ఇబ్బందులపై ఆరాతీశారు. చెరువుల పునరుద్ధరణతో పాటు..
వర్షాకాలంలో వరదల కట్టడికి హైడ్రా తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు
